Chalam Kathalu
చలం కథా వీథి
చలం రచనల్ని మెచ్చుకుంటూ 'ఏమిశైలి, ఏమి శిల్పం' అని అంటుంటే 'నాశైలి పాడుగాను, నేను చెప్పింది పట్టించుకోరేమర్రా' - అని విసుక్కొనేవాడు చలం. ఆయన విసుక్కున్నాడు గదా అని మనం వాటిని మర్చిపోతామా! తెలుగు కథకు ఆధునికతను ఇచ్చినవాడు గురజాడ అయితే, టెక్నిక్ను కథనశిల్పాన్ని ఇచ్చినవాడు చలం. విషయం, సందేశం మొదలయినవే ప్రధానం అయితే, ఈ టెక్నిక్ అంతా ఎట్లా వచ్చింది. ఆ టెక్నిక్ను విశ్లేషించి దానికి సూత్రాలు కట్టి మరెవరయినా వ్రాస్తే కథనానికి ఆ బలం. వస్తుందా! కథా సంకల్పానికున్న బలం, రచయిత ఆవేశాలే శిల్పాన్ని నిర్ణయిస్తాయి. అనటానికి చలం రచనలే మంచి ఉదాహరణలు. వ్రాసిన తర్వాత మళ్లీ వెనక్కి చూసుకొని నగిషీలు దిద్దుకొనే అలవాటు తనకు లేదని ఎక్కడో ఆయనే చెప్పాడు.
అడిగి వ్రాయించుకున్న కథలలో "ఓ పువ్వు పూసింది" మహాగొప్పది. అప్పట్లో మర్యాదస్తుల విఖ్యాత సాహిత్య ప్రతిక 'భారతి' చలం కథలను ప్రచురించేదికాదు. కాని తమ స్వర్ణోత్సవ సంచికకు ఒక రచన పంపమని వారే అడిగారు. "ఏభై ఏళ్ల 'భారతి'కి చలం కావలసివచ్చాడా” అని వ్యంగ్యంగా ఎత్తిపొడిచి “ఓ పువ్వు పూచింది" వ్రాసి పంపాడు. అది సర్వకాల మహోత్కృష్ట కథగా ఉండి పోయింది.
పూవు వివిధ వికాస దశలపై స్త్రీత్వాన్ని ఆరోపించిన, అన్యాపదేశ కథగా (ఎలిగరీ) అందరూ ప్రశంసిస్తారు. అంతమాత్రమే కాదు. అనంతలోకాధిపతి చేతినందుకొని ఆనంద సరసిలోకి ఎగిరిపోయిన జీవుని సంపూర్ణ జీవిత చిత్రణగా నాకు కనిపిస్తుంది. నిత్య సృష్టి లీలను వర్ణించిన భావప్రధానమయిన కథ ఇది.
చలం కలం సిరాలో అనేక రససమ్మేళనాలు ఉన్నాయి. అవి శిల్పావసరం బట్టి ఛాయలు మారుతుంటాయి అదేమి చిత్రమో పాఠకుల మనస్సు చలం సాహిత్యంలో శృంగారాన్ని, స్త్రీ పురుష సంబంధాలనే ముందుగా వెతుకుతుంది. విస్తృత వైవిధ్యాలకు అనేక ఉదాహరణలను ఇవ్వగలను. ఈ సంకలనంలో చలం స్పృశించిన కొన్ని భిన్న కోణాలకు ప్రతినిధి కథలను ఎంపిక చేసాము.
చలంలోని హాస్యం ప్రత్యేకంగా ఆస్వాదింపదగినది. అతనిలో ఒకే మూస హాస్యం ఉండదు. అతనొక హాస్య నమూనాను సిద్ధం చేసుకోలేదు. చలం తర్క శక్తి, హాస్య శక్తి కలసి అత్యంతబలంగా పాఠకుణ్ణి తన పక్షానికి మళ్లించుకుంటాయి..............................