Purnathvapu Polimeralo
మహాభారతంలో అవతారమూర్తి శ్రీ వ్యాస మహర్షి మానవజాతికోసం భీష్ముడి పాత్ర ద్వారా అందించిన మహోన్నతమైన 'మానవ సంబంధాల దివ్యౌషధం' ఈ శ్లోకం. ఈ శ్లోక స్ఫూర్తిని స్పృశించేముందు చేంబోలు శ్రీరామశాస్త్రి చేసిన ఈ సంకలనం చదవగానే ఏమనిపించిందో చెప్పాలి.
ఇప్పటి రోజుల్లో ఆత్మకథలుగానీ, ఎవరెవరో రాసిపెట్టే జీవితకథలుగానీ - అధిక శాతం - వాస్తవాల్ని మరుగుపర్చి, లేదా నిజాయితీకి ముసుగు వేసి, అవలక్షణాలున్న మనిషిని కూడా మహానుభావుడిగా ప్రదర్శించే ప్రయత్నాలే. అలాంటి రచనలు చూసి చూసి, జీవితకథలు అంటే తేనెలద్దిన ఆయుర్వేదపు గుళికల్లాంటి చేదుమందులే అన్న అభిప్రాయం కలుగుతున్న రోజులివి.
ఇలాంటి రోజుల్లో ... 'సమ్మాన్యుడు' అయిన యోగి గారి కుటుంబంలో చేంబోలు శ్రీరామశాస్త్రి అనే ఓ తమ్ముడు తాను జన్మించిన దగ్గరనుంచి చాలా దగ్గరనుంచి చూసిన తన అన్నగారి జీవిత శైలి గురించి, జీవనగమన రీతి గురించి, ఆలోచనా సరళి గురించి... ఇలా పలు కోణాల్లో విశ్లేషించి, ఉన్నది ఉన్నట్లుగా నిక్కచ్చిగా రాయటం ఓ సాహసం.
అన్నగారు స్వర్గస్థులయ్యాకనే ఆ తమ్ముడు ఈ రచన చేసి ఉంటే, దీని నిజాయితీ
ఉండేదేమో! కాని 2015 లోనే ప్రారంభించిన ఈ రచనని ఆయనకే చూపించి "నీ గురించి నా విశ్లేషణ ఇది అన్నయ్యా" అని చెబితే, ఆ అన్నగారు దాన్ని ఆసాంతం చదివి, "నా వ్యక్తిత్వాన్ని భలే బాగా పట్టుకున్నావురా అబ్బాయి" అన్నాడు. ప్రశంసాపూర్వకంగా.
ఏమిటా వ్యక్తిత్వం?