కథలు రాయడం చాలా తేలిక. మనసులో కదిలినవో... మనను కదిలించినవో చూసినవో చెప్పినవో చెప్పనివో ఏవో నాలుగు మాటలు రాసేస్తాం.అది వేరు.కాని కథల గురించి రాయడమే చాలా కష్టం. అదీ సముద్రమంత లోతున్న కథల గురించి...గాలి లాంటి గమన శీలత ఉన్న కథల గురించి... పచ్చి పుండులా సలపరిస్తున్న కథల గురించి రాయడం చాలా కష్టం.ఎందుకంటే పైపైన కాకుండా లోతుగా వెళ్లి అట్టడుగున ఉన్నది రాయో రత్నమో వెతికి వెతికి తెవాలి.కొన్ని సాంప్రదాయక కథలుంటాయి చూడూ...వాటిని రాయడమైనా వాటిగురించి రాయడమైనా చాలా తేలిక. పదవ తరగతిలో లెటర్ రైటింగ్ గురించి చెప్పనట్టు మొదలు చివర ఎత్తుగడ అంటూ ఏవో పది పడికట్టు పదాలు రాసి అవుననిపించుకొవచ్చు. కాని సాంప్రదాయాన్ని కాదని మూసలో కాకుండా దిమ్మీసతో గుద్దినట్టు మనలను కలవరపెట్టె కథలుంటాయి చూడు... వెంకట్ శిద్దారెడ్డి రాసిన సోల్ సర్కస్ లాంటివి... అగో...వాటి గురించి రాసేప్పుడు చాలా సంసిద్దత ఉండాలి.ముందుగా మనం ఎక్కడ నిలబడ్డామో చూసుకోవాలి.మనను మనం వెతుక్కోవాలి.నీళ్లలో చెపల్లా ఆడుతున్న ఆ కథల అత్మను పట్టుకోవాలి.అప్పుడు ఆచిలక గుట్టు విప్పాలి.అదేమంత సులభమైన పని కాదు.అలాగనీ కష్టమేమీ లేదు.ఉన్నదంతా పైపొరలు తొలిచి బరివాతల నిలబెట్టడమే.కాకుంటే నిషిద్ద బుద్దితో కాకుండా నిషితంగా చదవాలి. వెంకట్ శిద్దారెడ్డి కథలు చదివాక ముందుగా నేను కలవర పడ్డాను.మళ్లీ చదివాను.ఆలోచనల్లో పడ్డాను.కథ రచయిత అంతరంగమే అంటారు.కాని మనిషిగా ఆయనను చూస్తే అంత తాత్వికంగా అంత క్లిష్టంగా అనిపించడు.కాని కథలతొ మనసును మనలను చాలా చాలా డిస్టర్బ్ చేస్తాడు.