“వైజాక్కి స్టీలు ప్లాంటయినా వస్తుంది కాని మీకు బుద్ధి రాదు.” రామారావుకి అత్తగార్లాంటి వాళ్ళని చూస్తే అసహ్యం. ఆప్యాయతని వాళ్ళు “మనుషుల కొద్దీ మీటర్లలో కొలచి మరీ వొలకబోస్తారు.” "సాయంకాలం ఆరున్నరకి చీకటి, వెలుగూ ఒకటే సరిహద్దుని చేరుకున్నట్టున్నాయి.” "ప్రకృతికి ఇద్దరు కవల పిల్లలు పుట్టినట్టు వెలుగూ చీకటి కలిపి ఒకే లాగున్నాయి.” నాగరాజు మేనమామ అప్పట్లో అప్పుడెప్పుడో చాలా మంచివాడేనట. “కానీ, మంచితనం, సుఖం, మంత్రుల వాగ్ధానాలు ఇవేవీ శాశ్వతం కావు," కాబట్టి 'మిగితావాట్లాగే ఆ మంచితనంకూడా ఆఖరికి ఆవిరైపోయింది. "నిఖార్సయిన విషాన్నెండబెట్టి, దానికి పాలిష్ కొట్టి, హిట్లర్ మీసాలు తగిలించి, నూరో నెంబరు నూలు పంచె, ఖద్దరు లాల్చివేసి చేతికి ఓ కర్ర ఇస్తే - అది రెడ్డితుంది.” “దేవుడు మొన్ననే అవతారమెత్తి నిన్ననే చచ్చి పోయాడు.” “బాబుకి జ్వర మేమిటి? దేముడికే బాధలాగ!” - ఇలా ఈ కథల్లో చాలాచోట్ల విచిత్రంగానూ, బలంగానూ, స్పష్టంగానూ చెప్తాడు శ్రీరంగం రాజేశ్వరరావు. ఈ కథల్లో మనకు రాజేశ్వర్రావు హాస్యం లాస్యం, కన్నీళ్ళూ కోపం, వ్యంగ్యం వెటకారం అన్ని స్పష్టంగా కన్పిస్తాయి. అన్యాయం, అధర్మం యెడల కథకుడికి వుండే కసికూడా మనకి ఈ కథలనిండా కనిపిస్తుంది పద్దెనిమిది లేక పందొమ్మిదేళ్ళ వయసులోపలే ఇందులోని కథలన్నీ శ్రీరంగం రాజేశ్వరరావు రాయగలిగేడని అంటే అతను ఎంతటి ప్రతిభగల కథకుడో మనకి అర్థం అవుతుంది. - రాచకొండ విశ్వనాథశాస్త్రి విశాఖపట్నం, 04.04.1980.