ఈ మధ్యకాలంలో తెలుగులో వచ్చిన పుస్తకాల్లోకెల్లా, ఎంతో మాడర్న్ ఐడియాలతో, కాంటెంపరరీ జీవితాన్ని ప్రతిబింబించే నవల ఏదైనా ఉందంటే అది తటవర్తి నాగేశ్వరి రాసిన 'ప్రేమలు' అనడంలో సందేహం లేదు. నేటి యూట్యూబ్, టీవీ ఛానెళ్లలో తమ వ్యక్తిగత జీవితపు కాంప్లికేషన్స్న బహిరంగంగా వ్యక్తం చేసుకుంటున్న తీరును, వేగంగా మారుతున్న మానవ సంబంధాల విలువలను ఈ నవల ప్రతిబింబిస్తుంది. ఈ ఆధునిక సమాజంలో 'ప్రేమ' అనే పదానికి నిర్వచనం మారుతోంది. ఇదే ప్రేమ! అని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. వైదేహి, రాఘవల మధ్య సామాజిక కట్టుబాట్లను దాటిన స్నేహం (కొన్ని స్నేహాలు భార్యాభర్తల బంధం కన్నా బలంగా ఉంటాయనేందుకు నిదర్శనం), కూతురు సాయి పల్లవి జీవితంలో సామాజిక మాధ్యమాల ద్వారా మొదలైన ఆకర్షణ, విషాద ప్రేమ.. ఇలా అనేక రకాల అనుబంధాల కోణాలను ఈ నవల చాలా నిజాయితీగా, మనసు లోతుల్లోంచి పలకరిస్తుంది. దురదృష్టవశాత్తూ తెలుగు నవల వర్తమానాన్ని వదిలేసి గడిచిపోయిన చరిత్రను పట్టుకుని వేలాడుతున్న సమయంలో, మన మధ్య ప్రస్తుతం జరుగుతున్న ఎన్నో అంశాలను చర్చించిన 'ప్రేమలు' తప్పక చదివి తీరాల్సిన నవల. ప్రేమ, బాధ్యత, స్నేహం, మోసం, త్యాగం.. వంటి విభిన్న అనుబంధాలను మన ముందుంచిన ఈ మోడర్న్ తెలుగు నవల ఉగాది నవలల పోటీలో బహుమతి గెలుపొందిన నవల.