కలాల హలాలు భుజానేసుకున్న ఓ యువగుంపు నిత్య సాహిత్య సేద్యంలో స్నేహ కుసుమాలను విరబూయిస్తూ తమ గుంపుకు కలంస్నేహం అని పేరెట్టుకుంది. ఒకటా రెండా! ఆ సేద్యాన ఎన్ని ప్రయోగాలో, ఎన్నెన్ని ఫలాలో! తొలినుంచి మాతృభాషను మరువకుండా, తెలుగులోనే సంభాషిద్దాం అంటూ పెట్టుకున్న నియమాన్ని ఈనాటికీ ఖచ్చితంగా పాటిస్తున్నాము. ఇరవై మంది రచయితలతో గొలుసుకట్టు నవల, అంశం చెప్పిన 'వంద నిమిషాల'లో కథలల్లుకోవడం, అతి క్లిష్టమైన ప్రక్రియ, "మధ్యమ పురుష" ప్రక్రియలో కథల పోటీ, కథనమే లేకుండా, కేవలం సంభాషణలతో కథలు రాయటం, "పదకదంబం" పేరుతో తెలుగు పద సంపదను నిత్యం పంచుకోవడం, అంతేకాకుండా ఉత్సాహంగా, సందర్భోచితంగా నిర్వహించుకునే కథలు, కవితల పోటీలు. నిర్మొహమాటంగా, నిష్పక్షపాతంగా జరిగే జడ్జిమెంట్ ప్రక్రియలు, జాతీయవాద చారిత్రక సమకాలీన వార్తావిశేషాలపై సమగ్ర విశ్లేషణలు, సహేతుకంగా సాగే వాడివేడి చర్చలు మాత్రమే కాకుండా, బయట చాలా అరుదుగా దొరుకుతున్న 'విమర్శ'కు పట్టం కడుతూ, మా రచనలను శుద్ధి చేసుకుంటూ, ఓ రచయితగా ఎదిగేందుకు కావాల్సిన సమగ్ర వ్యక్తినిర్మాణమే లక్ష్యంగా సాగుతున్న సమూహం మా ఈ "కలంస్నేహం."